ఆదివారం మాంసాహారం తినడానికి, ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా.
వందశాతం సంబంధం ఉంది. మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని
శెలవు దినంగా ప్రకటించారు. మనము కూడా దాన్నే సెలవుగా పాటిస్తూ… సెలవు రోజుల్లో ఎంజాయ్
అనే పేరుతో కొంత మంది మద్యమాంసాలు, మరికొంత మంది మాంసాహారంతో రోజును గడిపేస్తున్నారు.
ఇంకొంత మంది మాంసాహారం తీసుకోమని డాక్టర్లే చెబుతున్నారు అంటారు. వారు చెప్పేది ఆరోగ్యం
సరిలేని వారు త్వరగా శక్తి పుంజుకోవడానికి. మాంసాహారం కూడా ఓ రకంగా స్టెరాయిడ్స్ లాంటివే.
తొందరగా శక్తినిచ్చి, శరీర శక్తిని మింగేస్తుంది.
ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్నే రవివారంగానూ
పిలుస్తారు. ఆంగ్లంలో సైతం సన్ డే అంటూ.. సూర్యుని ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఆరోగ్య కారకుడు.
అనారోగ్యాలు ఉన్న వారిని ఆదివారం నాడు సూర్యభగవానుణ్ని పూజించమని, ఆ స్వామికి సంబంధించిన
స్తోత్రాలు చదవమని చెబుతారు. అంతే కాదు వైద్యులు సైతం ఉదయం, సాయంత్రం ఎండలో ఉండడం వల్ల
ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల
ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నది జ్యోతిష శాస్త్రం చెబుతున్న వాస్తవం. మాంసాహారం తీసుకోవడం
వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దాని వల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు
చేయలేము. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి.
ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండా, ఉప్పు లేని భోజనం చేసిన
వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుంది. అంతే కాదు… ఈ రోజు సూర్యునికి అర్ఘ్యం
ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
కావాలంటే ఓ 7 ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన
స్తోత్రాలు చదవడం, మితాహారం తీసుకోవడం, సూర్యోపాసన చేయడం లాంటివి చేయండి. మీ ఆరోగ్యంలో
వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. మాంసాహారం తినేవారు ఓ 7 ఆదివారాలు దానికి దూరంగా
ఉండడం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు కదా. శాస్త్రం చెప్పిన ఈ విషయాల్ని కాస్త పాటించండి.
ఆరోగ్యవంతులు కండి.